శ్రీ ఉలగండ పెరుమాళ్ ఆలయం - కంచి


                 శ్రీ ఉలగండ పెరుమాళ్ ఆలయం                                           


                                                                                -- ఇలపావులూరి వేంకటేశ్వర్లు


కంచిలో ఉనశ్రీ వైష్ణవ దివ్యదేశాలలో ఈ ఆలయం ఎన్నో విధాలుగా ప్రత్యేకం. కంచిలో ఉన్న అర్చనా మూర్తులలో ఎత్తైన రెండు విగ్రహాలలో ఒకటి ఈ ఆలయంలో ఉంటుంది. ముప్పై అయిదు అడుగుల ఉలగండ పెరుమాళ్ (లోకాలను కొలిచిన పరంధాముడు) విగ్రహం ఒక అద్భుత అనుభూతిని ప్రసాదిస్తుంది. శ్రీ మహావిష్ణువు వామనునిగా వచ్చి రాక్షసరాజు బలిని మూడు అడుగుల నేల కోరుకుని త్రివిక్రమునిగా మారి, తొలి రెండు అడుగులతో ముల్లోకాలను ఆక్రమించి మూడో అడుగును బలిచక్రవర్తి కోరిక మేరకు అతని తలమీద పెట్టి పాతాళానికి పంపాడు. ఈ కథ మనందరికీ తెలిసిందే. . కాని ప్రహ్లాదుడి మనుమడు అయిన బలిచక్రవర్తికి అందరూ అతనిని పాతాళానికి పంపిన త్రివిక్రమ రూపాన్ని వేనోళ్ళ కొనియాడుతుంటే ఆ సమయంలో తన తలమీదశ్రీ పాదం ఉండటం వలన ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోలేక పోయానని బాధపడిపోయాడు. అతని ప్రార్థనకి, తనయందు అతనికి గల భక్తికి సంతసించి శ్రీ హరి అతనికి తన త్రివిక్రమ రూప సందర్శన భాగ్యాన్ని ఇక్కడ అనుగ్రహించాడని స్థానిక పురాణ గాథ. బలి కోరిక మేరకు స్వామి చిన్న సర్పరూపంలో ప్రధాన అర్చనా మూర్తికి ఒక ప్రక్కన స్వయంవ్యక్తంగా వెలశారు. అందుకే ఆళ్వారులు తమ పాశురాలలో ఈ క్షేత్రాన్ని "తిరు ఊరేగం"గా సంబోధించారు. ఎడమ కాలు ఆకాశాన్ని తాకేలా కుడిపాదం బలి తలమీద ఉంచి ముక్కోటి దేవతల నీరాజనాన్ని అందుకుంటున్నట్లుగా ఉండే ఈ నల్లరాతి త్రివిక్రమ రూపం భక్తుల హృదయాలలో శాశ్వత ముద్ర వేస్తుంది.



రెండో విశేషం ఏమిటంటే ఈ పడమర దిక్కుగా ఉన్న చిన్న ఆలయంలో మరో మూడు దివ్య దేశాలు ఉండటం. ఈ నాలుగు క్షేత్రాల గురించి "తిరుమంగై ఆళ్వార్, తిరుమలశై ఆళ్వార్" తమ పాశురాలలో ప్రస్తుతించారు. తీరు ఊరేగం తరువాత తొలి ప్రాకారంలో మిగిలిన మూడు దేవాలయాలున్నాయి. అవి తిరుక్కారకం, కార్వాణం మరియు తిరునీరంగం. తిరుక్కారకంలో శ్రీ కరుణాకర పెరుమాళ్ దేవేరులతో స్థానక భంగిమలో ఉంటామూ డటానికి ఉపాలయం మాదిరి ఉంటుంది ఆలయం.


తిరుకార్వాణంలో స్వామి కాల్వర్ గా స్థానక భంగిమలో ఉంటాడు. తిరునీరంగంలో ఎలాంటి అర్చనామూర్తి ఉండదు. శ్రీ జగదీశ్వర స్వామిగా పిలిచే ఒక ఉత్సవ విగ్రహం ఉంటుంది అంతే. ఈ స్వామి గురించి తిరుమంగై ఆళ్వార్ తన పాశురాలలో ఉదహరించినందున ఇక్కడ ఈ దివ్య దేశం ఉన్నట్లుగా భావించబడుతోంది. మరో మూడు రూపాలున్నా, ప్రధాన పూజలన్నీ ఉలగండ పెరుమాళ్ కే. ఈ ఆలయం ఉదయం ఆరు నుండి పన్నెండు వరకు, తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి పది వరకు తెరిచి ఉంటుంది. ప్రతితో నియంగా ఆరు పూజలు జరుగుతాయి. జనవరిలో ఆలయ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. శాసనాధారాల ప్రకారం ఈ ఆలయాన్ని ఆరు ఏడు శతాబ్దాల సమయంలో పల్లవరాజులు నిర్మించినట్లుగా తెలుస్తోంది. చోళులు, విజయనగర రాజులు కూడా ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేశారు.


కంచి బస్టాండ్ కు అతి సమీపంలో శ్రీ కామాక్షీ అమ్మవారి ఆలయానికి వెళ్ళే దారిలో ఉంటుందీ ఆలయం.